సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్.. మోహన్ బాబు ఏమన్నారంటే..!
Mohan Babu Reacts On Social Media Trolling. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని కావాలనే ట్రోల్ చేస్తున్న వారు కొందరు ఉన్నారు
By Medi Samrat Published on 17 Feb 2022 8:56 AM GMT
సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని కావాలనే ట్రోల్ చేస్తున్న వారు కొందరు ఉన్నారు. కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మిలు ఏమైనా మాట్లాడితే చాలు.. అదే పనిగా ట్రోలింగ్ చేసే పనిని కొందరు భుజాల మీద వేసుకుంటూ ఉంటారు. ఇటీవల మోహన్ బాబు నటించిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా కొందరు అదే పనిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ సినిమా టికెట్లు పెద్దగా అమ్ముడుపోలేదంటూ కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై మోహన్ బాబు స్పందించారు.
తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ట్రోలింగ్ పట్ల చాలా బాధపడుతున్నానని చెప్పారు. అటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనిషిగా ఆత్మాభిమానం ఉంటుందని.. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదని అన్నారు. వ్యంగ్య ధోరణి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని, తాను మామూలుగా అయితే వాటిని చూడనని, అయితే ఎవరన్నా పంపిస్తేనే చూస్తానని చెప్పారు. ఓ ఇద్దరు హీరోలు 50-100 మందిని అపాయింట్ చేసుకుని ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ హీరోలు ఎవరో తనకు తెలుసని అన్నారు. తాత్కాలికంగా వారు బాగుంటున్నప్పటికీ, ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభవిస్తారని ఆయన అన్నారు. ఇంతకూ ఎవరా హీరోలు అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.