ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..?
Acharya Pre Release Event. ఆచార్య సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి భారీ హైప్ వచ్చేసింది.
By Medi Samrat Published on 16 April 2022 11:15 AM GMT
ఆచార్య సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి భారీ హైప్ వచ్చేసింది. ముఖ్యంగా చిరంజీవి-రామ్ చరణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కాజల్, పూజ హెగ్డే మెరవనున్నారు. ఏప్రిల్ 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారనే ప్రచారం సాగుతూ ఉంది.
విజయవాడలో జరగనున్న ఈ ఈవెంట్కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా రాబోతోన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సీఎం జగన్, చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలే ఉండడం, సినిమా పరిశ్రమ సమస్యలపై చిరంజీవిని పలుమార్లు వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఇప్పుడు చిరంజీవి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పిలిచాడని, చిరు కోసం జగన్ కూడా రాబోతోన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో త్వరలోనే తేలిపోనుంది. తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేశారు. ట్విట్టర్ అకౌంట్ లోనూ చిరంజీవి ఆచార్యగా మారిపోయారు. తన ట్విట్టర్ ఖాతా పేరును 'ఆచార్య'గా మార్చుకున్నారు.