ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 20 ఫైరింజన్లు

By సుభాష్  Published on  3 Jun 2020 3:23 AM GMT
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 20 ఫైరింజన్లు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాల్మికీ బస్తీలో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. చిన్నచిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, ఎంతకి మంటలు అదుపులోకి రాకపోవడంతో మొత్తం 20 ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపుకి తీసుకువచ్చారు. కాగా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ బస్తీ మొత్తం మంటలు భారీగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అగ్నిమాపక డివిజన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌కే దువా మీడియాకు వివరించారు.

ప్రమాదంలో ఎవరు కూడా గాయపడకపోయినా.. దాదాపు 200 గుడిసెలకుపైగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వందలాది మందికి నిలువ నీడలేకుండా మారింది. కట్టుబట్టలతోనే బయటపడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

కాగా, ఢిల్లీలో ఇలాంటి అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని మురికి వాడలో కూడా ఎన్నో సార్లు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో వందలాది ఇళ్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది

అయితే మే 26వ తేదీన కూడా ఉదయం మురికి వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1500 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఘటన స్థలానికి 30 ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పితే కానీ, అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో కొందరు అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.



Next Story