మమతా సర్కార్కు షాకిచ్చిన కేంద్ర రక్షణ శాఖ
By సుభాష్ Published on 2 Jan 2020 9:50 AM GMTపశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ షాకిచ్చింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో పరేడ్ గ్రౌండ్లో దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. కాగా, వివిధ రాష్ట్రాల శకటాలను రక్షణ మంత్రిత్వశాఖ కమిటీ రెండు విడతలుగా పరిశీలించి, అనుమతి ఇస్తుంది. కానీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని ఈ వేడుల్లో ప్రదర్శించేందుకు నిరాకరించింది మంత్రిత్వశాఖ కమిటీ. దీంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్తో మమతాబెనర్జీ ప్రభుత్వం వివాదాలు నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ శకటానికి అనుమతి నిరాకరించిందని పలువురు భావిస్తున్నారు.
కాగా, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ఢిల్లీలో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా రాష్ట్రాల శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో తమ తమ రాష్ట్రానికి సంబంధించిన శకటాలను ప్రదర్శించేందుకు చర్యలు చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా శకటాలకు సంబంధించి మొత్తం 56 ప్రతిపాదనలు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు అందినట్లు తెలుస్తొంది.