5 ఏళ్ల మేనకోడలి తల నరికి హత్య చేసిన మామ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
Youth beheads his 5-year old niece allegedly to cure his illness by sacrificing the minor girl. 2022 మార్చి 15వ తేదీ మంగళవారం నాడు ఒడిశాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 16 March 2022 10:39 AM GMT
2022 మార్చి 15వ తేదీ మంగళవారం నాడు ఒడిశాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు తన 5 ఏళ్ల మేనకోడలిని నరబలి ఇచ్చాడు. సదరు యువకుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా.. ఆ రోగాన్ని నయం చేసేందుకు తన మేనకోడలి తల నరికి చంపాడు. ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెత్ఖమర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడైన నాగార్జున భైంసాను అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
5 ఏళ్ల రోజాలిన్ మంగళవారం తన మామ దేబేంద్ర భైంసా ఇంట్లో ఉంది. ఆమె అక్కడ భోజనం చేస్తుండగా నాగార్జున భైంసా వచ్చాడు. ఒక్కసారిగా బాలికపై గొడ్డలితో దాడి చేశాడు. దేబేంద్ర భైంసా రోజాలిన్పై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. ఆ తర్వాత నాగార్జున భైంసా మైనర్ బాలిక తల నరికి చంపాడు. బాధితురాలు, దేబేంద్ర భైంసా అరుపులు విన్న గ్రామస్తులు, బాధిత బాలిక తండ్రి సుశాంత్ భైంసా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు. దేవ్గఢ్ ఎస్పీ రాజ్కిషోర్ పైక్రే, సబ్-డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డిపిఓ) ప్రత్యూష్ మహపాత్ర సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. నిందితుడు విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలి మృతదేహానికి శవపరీక్షకు తరలించారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొన్ని జబ్బులతో బాధపడుతూ ఉన్నాడు. బాలికను హత్య చేస్తే జబ్బులు మానిపోతాయనే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. నాగార్జున భైంసా మానసిక స్థితి సరిగా లేదని బాధిత బాలిక కుటుంబం పేర్కొంది.