పుట్టినరోజు నాడే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Young man dies in an accident on his birthday in Nellore. తల్లిదండ్రులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు.
By Medi Samrat Published on 28 March 2022 8:04 AM GMT
తల్లిదండ్రులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా స్నేహితుడితో కలిసి బైక్పై స్వగ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలోనే నెల్లూరులోని జాతీయ రహదారిపై జరిగిన బైక్ ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు రోదిస్తూ.. ఇంటికి వచ్చే విషయమై ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ఇచ్చివుంటే వేరే వాహనంలో రావాలని సూచిస్తామని తెలిపారు. చేతికందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నెల్లూరు పట్టణంలోని ముత్యాలపాలెం ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్, సుజాత దంపతుల కుమారుడు లీనత్ కుమార్ చెన్నైలోని ఓ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం పుట్టినరోజు కావడంతో ఇంట్లోనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా స్నేహితుడితో కలిసి బైక్ పై నెల్లూరుకు బయలుదేరాడు. తడ మండలం కొండూరు ఓయో హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లీనత్ కుమార్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతని స్నేహితుడు, విశాఖపట్నానికి చెందిన మరో యువకుడు ఉమాశంకర్ నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.