కుక్క మొరిగిందని కుటుంబంపై కర్రలతో విరుచుకుపడ్డ వ్యక్తులు
Women beaten up with sticks in dispute over dog's barking. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 Dec 2021 6:33 AM GMT
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క మొరగడంతో ఐదుగురు మహిళలను కొంతమంది పురుషులు కొట్టినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 5న గర్హా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు మహిళలను కర్రలతో కొట్టడం చూడవచ్చు. గత బుధ, గురువారాల్లో జరిగిన ఈ దాడికి సంబంధించి.. ప్రిన్స్ శ్రీవాస్తవ (21), అతని స్నేహితులు మోను విశ్వకర్మ (26), బబ్లు శ్రీవాస్తవ (50), సిబు ధయ్య (21)లను పోలీసులు అరెస్టు చేసినట్లు గార్హా టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాకేష్ తివారీ తెలిపారు.
బాధితురాళ్లలో ఒకరైన సోనమ్ సింగూర్ (22)కి చెందిన కుక్క.. పక్కింటి ప్రిన్స్పై మొరగడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో అతను ఆదివారం కుక్కలను కర్రలతో కొట్టాడని పోలీసులు చెప్పారు. ప్రిన్స్ ప్రవర్తనపై సోనమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తీవ్ర వాగ్వాదం జరిగి.. నలుగురు నిందితులు సోనమ్తో పాటు ఆమె నలుగురు బంధువులైన మహిళలను కొట్టారని పోలీసు అధికారి తెలిపారు. అసభ్య పదజాలం వాడుతూ.. గాయపరిచినందుకు గానూ నిందితులపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.