Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మేడిపల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
By - Medi Samrat |
మేడిపల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వివరాళ్లోకెళితే.. ఈ నెల 12న బోడుప్పల్లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భార్య పూర్ణిమనే హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణిమ, అశోక్ దంపతులు.. వీరికి ఓ బాబు ఉన్నాడు.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ ప్లే స్కూల్ నిర్వహిస్తున్నాడు. పూర్ణిమకు పక్కనే ఉన్న ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉంటున్న మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో పూర్ణిమ, మహేష్ ప్రతిరోజా కలుస్తూ ఉండేవారు. ఈ విషయం భర్త అశోక్కు తెలిసి భార్య పూర్ణిమను మందలించాడు.
దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని అనుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడు మహేష్తో కలిపి పక్కా ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారమే పూర్ణిమ తన భర్త అశోక్ను రెండవ అంతస్తుకు పిలిచింది. భర్త రెండవ అంతస్తుకు రాగానే పూర్ణిమ, మహేష్, మరో ఇద్దరు కలిసి అశోక్ మెడకి ఉరివేసి గట్టిగా బిగించి హత్య చేశారు.
హత్య అనంతరం పూర్ణిమ మహేష్ సహా ఇద్దరు వ్యక్తులను వెనక డోర్ నుండి బయటకు పంపించింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అంతేకాకుండా గుండెపోటుతో మరణించాడని మాకు ఎటువంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో చున్నీతో ఉరివేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులకు భార్య పూర్ణిమపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పూర్ణిమ, మహేష్, వారికి సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు.