బీహార్లోని అరాలో భార్యాభర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడు తన భార్యకు వీడియో కాల్ చేసి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత భార్య కూడా శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున, మెరుగైన చికిత్స కోసం డాక్టర్ ఆమెను పాట్నా పిఎంసిహెచ్కి రెఫర్ చేశారు.
రెండు ఘటనలతో ఖంగుతిన్న మృతుడి సోదరుడికి గుండెపోటు రావడంతో ఆయన కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన ఉద్వాంత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెయానియా గ్రామంలో చోటు చేసుకుంది. మరణించిన జవాన్ను మహేష్ సింగ్గా గుర్తించారు. అతని భార్య పేరు గుడియా దేవి. ఈ ఘటనతో కుటుంబసభ్యులతో సహా చుట్టుపక్కల వారు షాక్కు గురయ్యారు. ఘటన గురించి తెలిసిన వెంటనే, జవాన్ అన్నయ్య జయనాథ్కు గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. దీనికి సంబంధించి, జవాన్ కుటుంబ సభ్యులు ఏదైనా విషయం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి ఇంత పెద్ద ఘటనకు దారితీసిందా..? అని కుటుంబసభ్యులు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.