Chittoor : ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
చిత్తూరు నగర శివార్లలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
By - Medi Samrat |
చిత్తూరు నగర శివార్లలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బైవీక్లీ సర్కిల్ వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టి లారీ కిందే ఇరుక్కుపోయింది. దీంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కారులో ఉన్న ఆరుగురు లోపలే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాహనాన్ని తెరిచి మృతదేహాలను బయటకు తీశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
కారు - కంటైనర్ ఢీ కొన్న ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందటం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. పరిస్థితిపై అధికారులకు మంత్రి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ మెరుగైన వైద్యం సహాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణాలు చేసే సమయంలో గమ్యం చేరే వరకు ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.