ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Three dead as a speeding car collides with a two wheeler in Vizianagaram. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శృంగవరపుకోట వద్ద గౌరీపురం సమీపంలో
By Medi Samrat Published on 10 April 2022 12:37 PM GMT
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శృంగవరపుకోట వద్ద గౌరీపురం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు ద్విచక్రవాహనాలను వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కోట పట్టణంలోని ఏవీ హోమ్స్లో నివసిస్తున్న కిల్లో సోనాపతి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై అనంతపురంలోని స్వగ్రామం కోనాపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో గౌరీపురం సమీపంలో రోడ్డు పక్కన తాటిముంజలు కొనేందుకు వాహనాన్ని ఆపాడు.
అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోనాపతి, అతని భార్య శ్రావణి తీవ్రంగా గాయపడగా, వారి పిల్లలు శ్రవణ్ (6), సువాస్ (3) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెద్దకండేపల్లికి చెందిన అప్పారావు, అతని చిన్న కూతురు ఐదేళ్ల సుచిత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నలుగురిని ఎస్ .కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సోనాపతి భార్య మృతి చెందింది. ది. ఎస్.కోట సబ్ ఇన్స్పెక్టర్ పి తారకేశ్వరరావు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.