ఉపాధ్యాయుడు దారుణ హత్య
Teacher Killed By Unknown Persons. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
By Medi Samrat Published on
11 March 2021 6:44 AM GMT

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఉదయం భగీరథ కాలనీ సమీపంలో ఒక ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. నరహరి అనే ఉపాధ్యాయుడు బైక్పై వెళుతుండగా.. దుండగులు కారుతో ఢీ కొట్టారు. దీంతో ఆయన కిందపడిపోవడంతో.. కారులో నుంచి దిగి కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారు.
కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దుండుగులు పక్కా ప్లాన్తో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నరహరి గత కొంతకాలంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీకి ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో కొంతమంది వ్యక్తులతో ఇటీవల గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ గొడవలో భాగంగానే ఆయనను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story