మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కత్తితో విరుచుకుపడ్డ కొడుకు
Son attacks father under influence of alcohol in Srikakulam. తండ్రిపై కొడుకు దాడి చేసిన సంఘటన సంతబొమ్మాళి మండలం భావనపాడు పంచాయతీ కొత్తపేట కాలనీలో
By Medi Samrat Published on 25 March 2022 12:45 PM GMT
తండ్రిపై కొడుకు దాడి చేసిన సంఘటన సంతబొమ్మాళి మండలం భావనపాడు పంచాయతీ కొత్తపేట కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యల నారాయణకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కొయ్యల పోలయ్య గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మద్యం కోసం తన భార్య లక్ష్మిని డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అక్కడ తండ్రి నారాయణ ఉండడంతో ఆగ్రహించిన పోలయ్య.. తండ్రి అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కత్తితో పొడవడంతో తల వెనుక భాగంలో, శరీరంలో మరో నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడు కత్తితో బయటకు వచ్చి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలయ్యను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నారాయణను చికిత్స నిమిత్తం 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. జిల్లా క్లూస్ టీం సభ్యులు రమేష్, ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు.