కలకలం రేపుతున్న ఏడేళ్ల బాలిక హత్య.. అప్పటివరకూ ఆడుకుంటున్న చిన్నారిని గొంతు కోసి..
ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఏడేళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశారు.
By Medi Samrat
ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఏడేళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశారు. ముగ్గురు పొరుగువారు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు.
పోలీసు వర్గాల ప్రకారం.. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్వరూప్ నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం రాత్రి ఎవరో బాలిక గొంతు కోసి చంపినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.
మూలాల ప్రకారం.. పొరుగున నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులు బాలిక హత్య వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం షాక్కు గురైంది. పగటిపూట వీధిలో ఆడుకుంటున్న ఆ బాలికను తాము చూశామని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.
ఔటర్-నార్త్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ నిధిన్ వాల్సన్ మాట్లాడుతూ.. మార్చి 30వ తేదీ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ తిరుగుతున్నట్లు తెలిపారు. ఖద్దా కాలనీకి చేరుకోగానే కొంతమంది గుమిగూడి మాట్లాడుకోవడం పోలీసు సిబ్బంది చూశారు. పోలీసులు వారిని విచారించగా ఓ ఇంట్లో ఓ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు తెలిసింది. దీంతో బృందం వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
మృతురాలి ఇంటి చుట్టుపక్కల అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పలు ఆధారాలు సేకరించింది. మృతురాలి తండ్రి బీహార్లోని పాట్నా నివాసి అని పోలీసుల విచారణలో తేలింది. తల్లి ఘజియాబాద్ నివాసి. వీరిద్దరూ లిబాస్పూర్లోని ఓ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలతో ఇక్కడ నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు తొమ్మిదేళ్లు, చిన్న కుమార్తెకు ఏడేళ్లు. చిన్న కూతురు హత్యకు గురైంది.
ఈ విషయమై బాలిక తల్లిదండ్రులను విచారిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అంతేకాకుండా, సమీపంలో నివసిస్తున్న ప్రజలను కూడా ప్రశ్నలు అడిగారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.