కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం

కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik
Published on : 13 Jun 2025 12:02 PM IST

Crime News, Andrapradesh, Karnataka, Accident, Apsrtc

కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం

కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మూడు నెలల చిన్న పాపతో పాటు ఆరుగురు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించారు.

ఏపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా నగర శివార్లలోని హోస్కోటే తాలూకా, గొట్టిపుర గేట్ వద్ద కోలార్-హోస్కోటే జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు, అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హోస్కోటేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ప్రమాదంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాంప్రసాద్ ఆదేశించారు.

Next Story