నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టింది. కారు టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.