ఆన్‌లైన్ రమ్మీలో భారీ నష్టాలు.. ఆత్మహత్య చేసుకున్న పోలీసు

Police commits suicide after heavy losses in online games. కోయంబత్తూరులో ఒక పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  17 July 2022 11:45 AM GMT
ఆన్‌లైన్ రమ్మీలో భారీ నష్టాలు.. ఆత్మహత్య చేసుకున్న పోలీసు

కోయంబత్తూరులో ఒక పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు కారణం ఆన్‌లైన్ రమ్మీ గేమ్ అని అతని స్నేహితులు, బంధువులు ఆరోపించారు. ఆన్ లైన్ రమ్మీ గేమ్ కు బానిస కావడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల కాళీముత్తు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లు ఆడుతూనే ఉండేవాడు. అందులో పోగొట్టుకోవడం తప్ప సంపాదించింది లేదు. అప్పులు మాత్రమే చేశాడు. స్నేహితులు కుటుంబ సభ్యులతో సహా తనకు తెలిసిన వ్యక్తుల నుండి రూ. 20 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. వీలైనంత త్వరగా తిరిగి చెల్లిస్తానని చెప్పుకున్నాడు. కానీ అతను గడువులోగా అనుకున్న పని చేయలేకపోయాడు.

కోయంబత్తూరులోని గాంధీపురంలో జరిగిన ఎగ్జిబిషన్‌లో 32 ప్రభుత్వ శాఖలు దుకాణాలు ఏర్పాటు చేశాయి. అక్కడ కాళీముత్తు విధుల్లో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిరిగా పని చేస్తూ డిస్‌ప్లేలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌తో కాల్చుకున్నాడు. కోయంబత్తూరు సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బుల్లెట్ బాధితుడి కడుపులోంచి లోపలికి ప్రవేశించి, వెనుక నుంచి బయటకు వెళ్లింది. కాల్పుల శబ్దం విన్న అతని సహోద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకోగా, రక్తపు మడుగులో పడి ఉన్న కాళీముత్తును గుర్తించారు. వారు అతన్ని కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తుపాకీ పేలుడు కారణంగా మూత్రపిండాలు దెబ్బతినడంతో అతడు ప్రాణాలు వదిలాడు. బ్రతికించడానికి ఎంతో ప్రయత్నించామని.. అతను చికిత్సకు స్పందించలేదని వైద్యులు తెలిపారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాకు చెందిన కాళీముత్తుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.









Next Story