తమిళనాడులోని కాంచీపురంలోని తన నివాసంలో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి బుధవారం తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. కబడ్డీ క్రీడాకారిణి భానుమతి తన గదిలోని సీలింగ్కు ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 25 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి కూరగాయల వ్యాపారి ధర్మరాజ్ చిన్న కుమార్తె. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా భానుమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తదుపరి విచారణ నిమిత్తం భానుమతి సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భానుమతి రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంది. సరైన ఉద్యోగం రాకపోవడంతో భానుమతి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమె మృతి వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.