ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రద్దీగా ఉండే వీధిలో 25 ఏళ్ల యువకుడిని పట్టపగలు హత్య చేశారు. ఓల్డ్ సిటీ ఏరియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీలో, దుండగుల గుంపు నడి రోడ్డుపై వ్యక్తిని కత్తితో పొడిచి చంపడం చూడవచ్చు. పొడిచి వెళ్లిపోయిన తర్వాత, అతను లేవడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వారిలో ఒకరు పరుగెత్తుకుంటూ వచ్చి మరోసారి పొడిచాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
పిటిఐ కథనం ప్రకారం.. అంతకు ముందురోజు చోటు చేసుకున్న గొడవ కారణంగా ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. అది కూడా కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో మద్యం సేవించిన తన మేనమామలు నౌషాద్, జావేద్, షాజాద్లతో గొడవ పడ్డాడని బాధితుడి తండ్రి తెలిపారు. ఇదే విషయమై హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు సాజిద్ ఆదివారం నాడు ఏదో పని నిమిత్తం బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇత్తెఫాక్ నగర్కు వెళ్లిన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. పోలీసులు సాజిద్ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. పోలీసుల విచారణ సాగుతోంది.