పట్టపగలు వ్యక్తి హత్య.. ఆర్థిక లావాదేవీల కారణంగానే..
Man brutally murdered over financial disputes in Yanam of East Godavari. పట్టపగలు ఓ వ్యక్తి హత్య తూర్పుగోదావరిలోని యానాంలో కలకలం రేపింది.
By Medi Samrat Published on 13 March 2022 11:40 AM GMT
పట్టపగలు ఓ వ్యక్తి హత్య తూర్పుగోదావరిలోని యానాంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని గోపాల్నగర్ మోకా వారి వీధిలో నివాసం ఉంటున్న మోకా వెంకటేశ్వరరావు(57)ని శనివారం ఇంట్లో ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. గాయాలతో రక్తమోడుతున్న వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు కారులో యానాం జీజీహెచ్ కు తరలించారు. వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు. కాజులూరు మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణ స్వామి మధ్యాహ్నం బయటకు వెళ్లిన సమయంలో తమ ఇంటికి వచ్చాడని మృతుడి కుమారుడు ఆనందమూర్తి పోలీసులకు తెలిపాడు. అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
వెంకటేశ్వరరావు గతంలో నారాయణ స్వామి వద్ద అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల తగాదాలే హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నారాయణ స్వామి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. ఘటనపై సబ్ ఇన్స్పెక్టర్ నందకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్లో వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సందర్శించి కొడుకు ఆనందమూర్తిని ఓదార్చారు. ఎస్పీ బాలచంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.