అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ఓ దుర్మార్గుడు.. 20 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనను చూసిన యువతి తల్లి వెంటనే ఆ కామాంధుడిపై కాళీకా దేవీలా దాడికి దిగింది. గొడ్డలితో ఐదుసార్లు ఆ దుర్మార్గుడి మెడను నరికింది. దాదాపు 10 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో తాజాగా ఉత్తరప్రదేశ్ కోర్టు యువతి తల్లికి యావజ్జవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2010 జులై 13న అర్ధరాత్రి కస్తూరి దేవీ ఇంట్లోకి ప్రవీణ్ అనే వ్యక్తి అక్రమంగా చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న తన కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో వెంటనే యువతి తల్లి ప్రవీణ్పై గొడ్డలితో దాడి చేసింది. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రవీణ్ హత్య అనంతరం కస్తూరి దేవీ సాయం కోసం అరవడం పథకం ప్రకారం చేసిన పనిగా కోర్టు పేర్కొంది.
ప్రవీణ్ను ఇంత దారుణంగా చంపకుండా.. కేవలం కొద్దిపాటి ప్రతిఘటనతో లైంగిక దాడి నుంచి తప్పించడం సాధ్యమయ్యేదని న్యాయమూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు యువతి తల్లి కస్తూరి దేవి వయసు 59 ఏళ్లు. ఈ కేసులో కస్తూరి కొడుకు, కూతురు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ప్రవీణ్ లైంగిక దాడికి యత్నించడంతోనే తమ తల్లి గొడ్డలితో అతనిపై దాడి చేసిందని కస్తూరి దేవీ కొడుకు, కూతురు కోర్టుకు తెలిపారు. కోర్టులో విచారణ ముగిసిన తర్వాత కస్తూరి దేవీని దోషిగా నిర్దారిస్తూ బలందర్షహర్ అడిషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 70 ఏళ్ల వయసు ఉన్న కస్తూరి దేవీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.