మహిళా కానిస్టేబుల్ డెడ్ బాడీ డ్రైనేజీలో..!

Lady constable's body found in drain. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పీజీఐ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మహిళ మృతదేహం

By Medi Samrat  Published on  21 Feb 2022 6:42 AM GMT
మహిళా కానిస్టేబుల్ డెడ్ బాడీ డ్రైనేజీలో..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పీజీఐ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేగింది. పోలీసుల విచారణలో ఆ మృతదేహం మహిళా కానిస్టేబుల్ రుచి సింగ్‌దే అని తేలింది. పోలీసులు రంగంలోకి దిగగా ఈ దారుణం ప్రేమ వ్యవహారం ద్వారా చోటు చేసుకుందని అన్నారు. మహిళా కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్ ద్వారా నాయబ్ తహసీల్దార్‌తో స్నేహం ఏర్పడిందని.. ఆ తర్వాత ఆమె జీవితంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు.

మహిళా కానిస్టేబుల్ ఫిబ్రవరి 13 నుండి విధుల్లో లేదు. దీంతో సహచరులు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించారు. రుచి సింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. దీంతో వారు పోలీసులను సంప్రదించారు. కాళీమాత ప్రాంతంలోని డ్రెయిన్ నుంచి మహిళా కానిస్టేబుల్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషయాన్ని లక్నోలోని పీజీఐ పోలీస్ స్టేషన్ అధికారులు సుశాంత్ గోల్ఫ్ పోలీస్ స్టేషన్‌కు నివేదించారు. కానిస్టేబుల్ రుచి సింగ్‌తో పనిచేస్తున్న సహచరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు బిజ్నోర్‌లోని మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.

ప్రతాప్‌గఢ్‌లోని రాణిగంజ్‌లో పోస్ట్ చేసిన నాయబ్ తహసీల్దార్ రుచితో ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బంధం మరోస్థాయికి చేరుకుంది. వీరిద్దరూ గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నాయబ్ తహసీల్దార్‌కు అంతకు ముందే పెళ్లయింది. ఇటీవల మహిళా కానిస్టేబుల్ అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు నాయబ్ తహసీల్దార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య చేయడానికి కారణాలను విచారిస్తూ ఉన్నారు. మహిళను ఎందుకు హత్య చేశారన్న మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని లక్నో పోలీసులు తెలిపారు.


Next Story