భార్యా భర్తల మధ్య అనుమానం పెను భూతమైతే..!

Husband Killed Wife. భార్యా భర్తల మధ్య అనుబంధాలకు బదులుగా.. అనుమానాలు పెరిగితే ఎంతో కష్టం..! ఎన్నో ఘోరాలు కూడా

By Medi Samrat  Published on  9 Aug 2021 5:18 AM GMT
భార్యా భర్తల మధ్య అనుమానం పెను భూతమైతే..!

భార్యా భర్తల మధ్య అనుబంధాలకు బదులుగా.. అనుమానాలు పెరిగితే ఎంతో కష్టం..! ఎన్నో ఘోరాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా అనుమానం పెంచుకున్న భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని లింగసముద్రం మండలం అన్నిబోయినపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అన్నిబోయినపల్లి రజకపాలేనికి చెందిన పుటికలపూడి నరసింహం నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. అంతేకాకుండా రమణమ్మ (45)పై అనుమానం పెంచుకున్నాడు. ఎప్పుడూ ఆమెను వేధిస్తుండేవాడు.

ఆదివారం తెల్లవారుజామున భార్యతో ఘర్షణకు దిగిన నరసింహం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను జుట్టుపట్టుకొని మొద్దుకత్తితో మెడపై వేటు వేశాడు. రమణమ్మ భయపడి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల నివాసితులు మేల్కొని హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమణమ్మ చనిపోయింది. నరసింహం అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుని ఆచూకీ తెలుసుకొని అదుపులోనికి తీసుకున్నారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్‌, గుడ్లూరు ఎస్సై మల్లికార్జునలు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన రమణమ్మకు నలుగురు కుమారులు కాగా, ఇద్దరికి వివాహమైంది. మరో ఇద్దరు హైదరాబాదులో బేల్దారి పనిచేస్తున్నారు.


Next Story