జాతీయ రహదారిపై మహిళ అర్ధనగ్న మృతదేహం.. ఏం జ‌రిగింది.?

శుక్రవారం ఉదయం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బరేలీ-సీతాపూర్ జాతీయ రహదారిపై ఫరీద్‌పూర్ బైపాస్‌లోని డివైడర్ ద‌గ్గ‌ర పడి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది

By Medi Samrat  Published on  26 Oct 2024 10:28 AM GMT
జాతీయ రహదారిపై మహిళ అర్ధనగ్న మృతదేహం.. ఏం జ‌రిగింది.?

శుక్రవారం ఉదయం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బరేలీ-సీతాపూర్ జాతీయ రహదారిపై ఫరీద్‌పూర్ బైపాస్‌లోని డివైడర్ ద‌గ్గ‌ర పడి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని చాలా వాహనాలు తొక్కాయి. మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి మృతదేహాన్ని విసిరివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాతే నిజం బయటపడనుంది. మహిళను గుర్తించలేకపోయారు.. ఘటనా స్థలం నుంచి అధికారులు ఆధారాలు సేకరించారు. పోలీసులు ఈ విషయాన్ని ప్రమాద ఘటనగా పరిగణిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఫరీద్‌పూర్ బైపాస్ సమీపంలో ఓ మహిళ అర్ధనగ్న శరీరం పడి ఉందని ఫరీద్‌పూర్ పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మహిళ మృతదేహం పడి ఉంది. ఒక చేయి పైకి లేచింది. మొండెం కింద బట్టలు లేవు. ప్రయాణిస్తున్న వాహనాల కింద‌ మృతదేహం నుజ్జునుజ్జు అయింది. దీని కారణంగా మహిళ ముఖం కూడా వికృతమైంది. ఆమెను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. ఉదయం డివైడర్ దగ్గర పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూశామని సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న దాబా ఉద్యోగులు తెలిపారు.

మ‌హిళ కింది భాగంలో బట్టలు లేకపోవడంతో కదులుతున్న వాహనంపై నుంచి తోసేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ అభిషేక్ సింగ్ వాదిస్తూ.. ప్రమాదాల వల్ల బట్టలు కూడా చిరిగిపోతాయన్నారు. మహిళను వాహనం ఢీకొట్టి ఎక్కువ దూరం ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె బట్టలు చిరిగిపోయి ఉండవచ్చు. మృతదేహం డివైడర్‌కు దగ్గరగా పడి ఉండటం వల్ల ఇతర డ్రైవర్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు, దీని కారణంగా చాలా వాహనాలు ఆమెపైకి దూసుకెళ్లి ఉండవచ్చని అన్నారు.

మరణానికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. మృత దేహాన్ని గుర్తించేందుకు ఇంకా వేచి చూడాల్సి ఉంది. అందుకే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం హౌస్‌లో ఉంచారు. ఎటువంటి క్లూ లేదా ఆధారాలు మిగిలిపోకుండా చూసేందుకు ఫీల్డ్ యూనిట్‌ను సంఘటనా స్థలానికి పిలిచారు. ప్రాథమికంగా ఇది ప్రమాదంగా కనిపిస్తోంది.

Next Story