ఓ పేషెంట్కు కిడ్నీలో రాళ్లు తొలగించేందుకు బదులుగా కిడ్నీ తొలగించినదుకు సదరు డాక్టర్పై గుజరాత్ రాష్ట్ర కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెస్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేషెంట్ కుటుంబానికి రూ.11.23 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. పేషెంట్ కిడ్నీ తొలగింపు, అతని మరణానికి వైద్యులే కారమణని కమిషన్ పేర్కొంది. ఇదంతా ఆస్పత్రి నిర్లక్ష్యమేనని కమిషన్ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని అహ్మదాబాద్లో దేవేంద్ర భాయ్ రావల్ అనే వ్యక్తి వెన్ను నొప్పి, మూత్ర విసర్జన సమస్యతో బాధపడేవాడు. నొప్పి తీవ్రం కావడంతో దేవేంద్ర దగ్గర్లోని కేఎంజీ సెంట్రల్ ఆస్పత్రికి వెళ్లాడు.
2011 సంవత్సరంలో డాక్టర్ శివుభాయ్ పరీక్షలు చేసి దేవేంద్ర ఎడమ కిడ్నీలో 14 మిల్లీ మీటర్ల రాయి ఉన్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత మంచి ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్ శివుభాయ్ సూచించాడు. అయితే దేవేంద్ర మాత్రం అదే ఆస్పత్రిలో చేరగా.. సెప్టెంబర్ 3వ తేదీన డాక్టర్లు దేవేంద్రకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేముందు కిడ్నీలో రాళ్లు తొలగించడం కన్నా కిడ్నీ తొలగిస్తేనే మంచిదంటూ దేవేంద్ర బంధువులకు డాక్టర్ శివుభాయ్ చెప్పాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించారు. కొద్ది రోజులకు దేవేంద్ర ఆనారోగ్యం బారిన పడ్డాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో ఐకేడీఆర్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ దేవేంద్ర 2012 జనవరి 8వ తేదీన మరణించాడు. దీంతో దేవేంద్ర బంధువులు రాష్ట్ర కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రె్ కమిషన్ను ఆశ్రయించారు.