యువతిని హత్య చేసి.. సూట్కేసులో పెట్టి.. రెండు చెక్పోస్టులు దాటారు.. ఆ తర్వాత
ఢిల్లీలోని ఘాజీపూర్లో సూట్కేస్లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. నిర్జన ప్రాంతంలో ఒక సూట్కేస్ ఉండడం చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
By Medi Samrat Published on 28 Jan 2025 4:47 PM ISTఢిల్లీలోని ఘాజీపూర్లో సూట్కేస్లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. నిర్జన ప్రాంతంలో ఒక సూట్కేస్ ఉండడం చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అందులో లోపల మృతదేహాన్ని గుర్తించింది. శరీరం పూర్తిగా కాలిపోయింది. హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం కేసు నమోదు చేసిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి వివరాలు సేకరించారు.
"మాకు మొదట్లో ఎలాంటి క్లూ లభించలేదు. కేవలం కాలిపోయిన సూట్కేస్, కాలిపోయిన మృతదేహం. సూట్కేస్ దొరికిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ద్వారా విచారణ ప్రారంభించాము." అని తూర్పు ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ ధనియా మీడియాకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పదంగా కనిపించిన హ్యుందాయ్ వెర్నా కారు వివరాలు కనుక్కోడానికి పోలీసులు ప్రయత్నించారు. కారు నంబర్ను ట్రాక్ చేసారు, కారును అమిత్ తివారీ అనే వ్యక్తి కొన్నట్లు గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అమిత్ తివారీ (22) అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమిత్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఘజియాబాద్లో నివసిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన అతని స్నేహితుడు అనూజ్ కుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుజ్ వెల్డింగ్ మెకానిక్గా పనిచేస్తూ ఘజియాబాద్లో నివసిస్తున్నాడు.
అమిత్ ను విచారించి.. మృతదేహం అతడి బంధువు శిల్పా పాండేదిగా గుర్తించారు. తాను శిల్పాతో రిలేషన్షిప్లో ఉన్నానని, ఏడాది పాటు సహజీవనం సాగిస్తున్నామని అమిత్ చెప్పాడు. శిల్పా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ అమిత్ ఆమె నుండి విడిపోవడానికి ప్రయత్నించాడు. శనివారం రాత్రి అమిత్ మద్యం తాగి శిల్పతో గొడవ పడ్డాడు. ఆవేశంతో ఆమెను గొంతు నులిమి చంపాడు. ఆమె మృతదేహాన్ని సూట్కేస్లో వేసి, మృతదేహాన్ని పారవేయడానికి సహాయం చేయాలని తన స్నేహితుడు అనూజ్కు ఫోన్ చేశాడు.
మృతదేహాన్ని పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పడేయాలనేది అమిత్ అసలు ప్లాన్. కానీ ఇద్దరూ బయలుదేరిన వెంటనే, వారు రెండు చెక్పోస్టులను దాటారు. మరింత ముందుకు వెళితే పోలీసుల సోదాలు ఉంటాయని అనుకుని, అమిత్ మృతదేహాన్ని పారవేశాడు. పెట్రోల్ పంపు నుంచి డీజిల్ కొన్నాక, సూట్కేసును నిర్జన ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత దాన్ని తగులబెట్టారు. గ్రేటర్ నోయిడాలో ఉన్న అమిత్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శిల్పా తల్లిదండ్రులు, గుజరాత్లోని సూరత్లో నివసిస్తున్నారని దర్యాప్తులో తేలింది.