తూర్పు గోదావరి జిల్లాలో యువకుడిని క్రూరంగా చంపి.. రోజుకో భాగాన్ని కాల్చి..

Brutal murder of a youth in East Godavari district. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలం పరిధిలోని కొల్లాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ యువకుడి హత్య ఇప్పుడు సంచలనం రేపుతోంది.

By అంజి  Published on  4 Dec 2021 11:53 AM GMT
తూర్పు గోదావరి జిల్లాలో యువకుడిని క్రూరంగా చంపి.. రోజుకో భాగాన్ని కాల్చి..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలం పరిధిలోని కొల్లాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ యువకుడి హత్య ఇప్పుడు సంచలనం రేపుతోంది. గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత మృతదేహంతో నిందితులు అత్యంత పాశవికంగా వ్యవహారించారు. మృతదేహం శరీర భాగాలను ముక్కలుగా కోసి.. రోజుకో భాగాన్ని కాల్చి బూడిద చేశారు. మనిషి శరీరం కాల్చిన దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అత్యంత క్రూరంగా యువకుడిని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కొల్లాపూర్‌ గ్రామానికి చెందిన నాగ సాయిని నలుగురు దుండగులు హత్య చేశారు. ఆ తర్వాత అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసి రోజుకొకటి కాల్చి బూడిద చేస్తున్నారు. తాజాగా మృతుడి శరీరంలోని ఓ భాగాన్ని దహనం చేస్తుండగా దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సగం కాలిన శరీర భాగాలు దొరికాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. కాగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాగసాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగసాయిని హత్య చేయడానికి గల కారణాలపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story