దారుణం : పెళ్ళిలో 7 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం
7-year-old girl was abducted In Bihar. వివాహ కార్యక్రమం మధ్యలో 7 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన హృదయ విదారక సంఘటన
By Medi Samrat Published on 26 March 2022 10:10 AM GMT
వివాహ కార్యక్రమం మధ్యలో 7 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన హృదయ విదారక సంఘటన బీహార్లోని బెగుసరాయ్లో వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పెళ్లి ఇంటి నుంచి బాలికను కిడ్నాప్ చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.
ఈ సంఘటన మార్చి 21, సోమవారం నాడు చోటు చేసుకుంది. బెగుసరాయ్ జిల్లాలోని ఎఫ్సిఐ ఒపి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుక నుండి నిందితుడు 7 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. నిందితుడు మహ్మద్ జంషెడ్ అలియాస్ కరువా బాలిక ఇంటి పొరుగువాడు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం బాలిక గొంతుకోసి హత్య చేసేందుకు కూడా నేరస్థుడు ప్రయత్నించాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నిందితుడు పారిపోయాడు. బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతకగా పొలంలో అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది.
ఘటన అనంతరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు బాలికను చూసి సదర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. సదర్ డీఎస్పీ అమిత్ కుమార్, హెడ్ క్వార్టర్స్ డీఎస్పీ నిషిత్ ప్రియ ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. మొత్తం ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.