పుట్టినరోజున సామూహిక అత్యాచారానికి గురైన బాలిక.. నలుగురు అరెస్టు
14-year-old runaway girl Sexually Abused on her birthday in Karnataka. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక
By Medi Samrat Published on 20 Feb 2022 5:44 AM GMT
కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక తన పుట్టినరోజున సామూహిక అత్యాచారానికి గురైన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని.. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితులలో ముగ్గురు మేస్త్రీలు, ఒకరు బస్సు డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను ఆనంద్ కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలిక.. కొత్త బట్టలు, చాక్లెట్లు కొనకపోవడంతో తల్లిదండ్రులపై ఆగ్రహంతో పాఠశాలకు వెళ్లకుండా శుక్రవారం నాడు బంగారపేటకు బస్సు ఎక్కింది.
ఒంటరిగా ఉన్న బాలికను చూసిన దుండగులు ఆమెతో నమ్మకంగా మాట్లాడి.. పార్కుకు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. సాయంత్రం ఆమెను ప్రైవేట్ బస్సులో తానిమడగు గ్రామానికి నిందితులు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నిందితులు మద్యం సేవించి.. ఏకాంత ప్రదేశంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి బడిగట్టారు. బాలిక అరుపులు విన్న గ్రామస్థులు కామసముద్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.