మహిళను వివస్త్రను చేసి బలవంతంగా డ్యాన్స్‌.. పుట్టినరోజు వేడుకలంటూ..

By అంజి  Published on  27 Feb 2020 7:03 AM GMT
మహిళను వివస్త్రను చేసి బలవంతంగా డ్యాన్స్‌.. పుట్టినరోజు వేడుకలంటూ..

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజంటూ పిలిచి మహిళపై అఘాయిత్యం చేసేందుకు నలుగురు యువకులు యత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌లోని ఓ మహిళ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పని చేస్తోంది. కాగా డెయిరీఫాం చౌరస్తా వద్ద నివాసం ఉండే ఓ యువకుడు తన పుట్టిన రోజు వేడుకలు అని చెప్పి, వాటి నిర్వహణ బాధ్యతల కోసం ఆ మహిళతో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ క్రమంలో గత శనివారం రోజు రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అనంతరం వేడుకలు ముగిసాక.. అమీర్‌ తన స్నేహితులు రజత్‌ అలీ, సల్మాన్‌లతో కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆ మహిళను డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతం చేశారు. తనకు డ్యాన్స్‌ రాదని ఎంత మొత్తుకున్న ఆ యువకులు వినలేదు. ఆ మహిళను ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత మహిళను కత్తులతో బెదిరించి, వివస్త్రను చేసి బలవంతంగా డ్యాన్స్‌ చేయించారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాగొలా తప్పించుకున్న బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది.

భర్త సాయంతో బాధిత మహిళ ఈ నెల 23న రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఘటన జరిగిన రోజునా నిందితులతో పాటు మరో మహిళ ఉందని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపారు.

Next Story