కనిపించని శత్రువును తరిమికొట్టడమే మన ముందున్నలక్ష్యం
By సుభాష్ Published on 5 April 2020 6:53 AM ISTకరోనా మహమ్మారికి మందు లేదు. కరోనాకు మతాలు, కులాలు లేవు. కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేకుండా కాటేసే మహమ్మారి. అంతేకాదు కరోనా కాటుకు దేశాలు అనే తేడా లేదు. ఈ యుద్ధంలో మన కంటికి కనిపించని వైరస్ను తరిమికొట్టడమే మన ముందున్న లక్ష్యం. ఈ వైరస్కు వ్యతిరేకంగా మనమందరం పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క అడుగు తోడై సామూహికంగా గెలిచి తీరాల్సిన సమయం ఇది. అందరం ఐక్యంగా ఉన్నామని దేశానికి, ప్రపంచానికి చాటిచెబుతాం.
కరోనా మహమ్మారి దేశాలను పట్టిపీడిస్తోంది. కరోనా చీకట్లను తరిమికొట్టడానికి భారతదేశమంతా ఒక్కటై సంకల్పాన్ని బలంగా ప్రదర్శించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు మీమీ ఇళ్లల్లో లైట్లు ఆర్పేసి దీపాలు గానీ, కొవ్వొత్తులు గానీ, మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్చేసి 9 నిమిషాలపాటు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, శుక్రవారం ఒక వీడియో సందేశం ద్వారా దేశ ప్రజలకు ఈ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారని, ఈ యుద్ధంలో శక్తులు, అహర్నిశలు ధారపోసి మార్చి 22న ప్రతీ ఒక్కరు గుమ్మం ముందుకు వచ్చి చప్పట్లతో డాక్టర్లను అభినందించారని గుర్తు చేశారు మోదీ. ప్రతీ ఒక్కరు ఇలా ఆచరించడం అభినందనీయమని దేశ ప్రజలను కొనియాడారు. ఈ విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రతి ఒక్కరిలో ఒంటరి భావాన్ని పోగొట్టడం ఎంతో అవసరమన్నారు. నేటి సంకల్పంతో దేశంలో 130 కోట్ల మంది మనకు తోడుగా ఉన్నారని సంఘాభావాన్ని చాటుదామన్నారు. దేశంలో ఇంతటి యుద్ధం చేస్తున్న సమయంలో ఎప్పటికప్పుడు ఈ అద్భుతమైన సమైక్య శక్తి ప్రజల రూపంలో నిరూపితమవుతుందన్నారు. ఈ భవనే మనలో ధైర్యాన్ని నింపి సామూహిక లక్ష్యం వైపు పయనించేలా చేస్తుందన్నారు. అంతేకాదు కరోనా మహమ్మారి చీకట్ల నుంచి కాంతి రేఖ కనబడుతుందన్న ఆశాభావంతో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు.అందరు కలిసి చేస్తేనే వెయ్యి ఏనుగుల బలం కలిగిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి 9 గంటలకు మీ ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆర్పివేసి మీ ఇళ్లల్లో గడప ముందు, బాల్కానీలలో వెలిగించిన క్రొవ్వొత్తులు, దీపాలు, టార్చీలైట్లు, మొబైల్ లైట్లను పట్టుకుని 9 నిమిషాల పాటు నిలబడండి. అలా నిలబడి ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో, ఆ పోరాటంలో మనం ఒంటరి కామని చెప్పుకొంటూ సామూహిక లక్ష్య సాధనకు సంకల్పం చెప్పుకొందామని మోదీ పిలుపునిచ్చారు.