సచిన్ పైలట్‌కు షాకిచ్చిన‌ కాంగ్రెస్ అధిష్ఠానం

By Medi Samrat  Published on  14 July 2020 9:19 AM GMT
సచిన్ పైలట్‌కు షాకిచ్చిన‌ కాంగ్రెస్ అధిష్ఠానం

రాజస్తాన్‌లో ఏర్ప‌డిన‌ రాజకీయ సంక్షోభం నేడు మ‌రో మ‌లుపు తిరిగింది. సీఎల్పీ భేటీకి రెండోసారి డుమ్మా కొట్టిన తిరుగుబాటు నేత‌, రాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ అధిస్టానం‌ వేటు వేసింది. సచిన్ పైల‌ట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ ఛీప్‌ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల కొద్దిసేప‌టి క్రితం ప్రకటించారు.



ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల.. గత‌ నాలుగు రోజులుగా అధిష్టానం.. అనేకమార్లు చ‌ర్చ‌లు జరిపినప్పటికీ స‌చిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదని విమర్శలు గుప్పించారు. పైలట్‌ స్థానంలో అధిస్టానం రాజస్తాన్ నూత‌న‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా గోవింద్‌ సింగ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్న‌ట్లు తెలిపారు.



అంత‌కుముందు ఉద‌యం జరిగిన సీఎల్పీ భేటీలో 102 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సైమాచారం. సీఎం అశోక్ గెహ్లాట్ నాయకత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేల డిమాండ్‌తో.. పైల‌ట్ వ‌ర్గంపై కాంగ్రెస్‌ చర్యలకు ఉప‌క్ర‌మించింది. పైలట్‌తో పాటు మరో ఇద్దరు అసమ్మతి మంత్రులు రమేష్‌మీనా, విశ్వేంద్రసింగ్‌లను కూడా మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు సీఎల్పీ భేటీకి హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా క్రమశిక్షణా చర్యలకు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Next Story