ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్లో నాగుపాము హల్చల్
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2020 12:15 PM ISTఒకప్పుడు పాములు ఊరి చివర పుట్టల్లో, పొల్లాల్లో, అడవుల్లో ఉండేవి. అయితే.. అడవులు కనుమరుగు అవుతుండడంతో.. ఇప్పుడు అవీ ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. ఇంటి కప్పు, బ్రాత్రూమ్లల్లో పాములు కనిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా మెట్రో స్టేషన్లు అన్ని మూత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టేషన్లో జనసంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్లో నాగుపాము హల్చల్ చేసింది.
మెట్రో స్టేషన్ గేట్ దగ్గర నాలుగు అడుగుల పొడవు ఉన్న నాగుపామును చూసి అక్కడి సిబ్బంది హడలెత్తిపోయారు. వెంటనే పై అధికారులతో వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తరువాత దాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలివేశారు. ప్రస్తుత్తం మెట్రో రైళ్లు నడవకపోవడంతో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సాకెట్ మెట్రో స్టేషన్లో కొండచిలువను, ఓక్లా బర్డ్ సాంక్సుయరీ మెట్రో స్టేషన్లో నాగుపామును రక్షించినట్లు వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది తెలిపింది.