అమెరికాలో 61లక్షలు.. భారత్‌లో 35లక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 5:56 AM GMT
అమెరికాలో 61లక్షలు.. భారత్‌లో 35లక్షలు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,761 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 948 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 35,42,734 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకోగా.. 7,65,302 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 63,498 మంది మరణించారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76 శాతం ఉండగా.. మరణాల రేటు 1.8శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 10,55,027 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 4,14,61,636 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 61,39,078 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 38,46,965 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్‌ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story