గ్రామాల్లో పర్యటనకు సిద్దమవుతున్న సీఎం జగన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Jun 2020 6:56 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ గురువారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం జగన్ గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.