దారిపొడవునా చంద్రబాబు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన..
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 May 2020 9:46 AM ISTకరోనా వైరస్ విస్తృతి కారణంగా విధించిన లాక్డౌన్తో రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిన్న అమరావతికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు నిన్న విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం మ ముందుగానే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. విశాఖ వెళ్లి గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను ఆయన కలిసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దానికి ఏపీ పోలీసుల అనుమతి కూడా లభించింది. కానీ అర్ధరాత్రి విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే అమరావతికి బయల్దేరి వెళ్లారు.
అయితే.. చంద్రబాబు దారిపొడవునా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అధికార వైసీపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో వీడియోలను కూడా పోస్ట్ చేసింది. గుంపులుగా చేరిన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులు.. చంద్రబాబు బాధ్యతారాహిత్యం.. చెప్పేందుకే నీతులా? వైసీపీ ట్వీట్ చేసింది.
ఇదిలావుంటే.. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు వెనుక వైసీపీ కుట్ర ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు విశాఖపట్నం పర్యటనను ప్రకటించగానే.. విజయవాడ, వైజాగ్ ఎయిర్ పోర్టులను ఒకరోజుపాటు మూసివేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం కోరడంతోనే.. విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్టులలో సర్వీసులు ఒకరోజు నిలిపివేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ కూడా చేశారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.