కరోనా కల్లోలం.. భాగ్యనగరంలో కేంద్ర వైద్య బృందం పర్యటన
By అంజి
హైదరాబాద్: చైనాలో చిన్నగా మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది కరోనా వైరస్. భారత్లోకి ఇంకా కరోనా వైరస్ రాలేదని మనం అనుకుంటున్నా.. పలు అనుమానాపు కేసులు మాత్రం మనల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న నలుగురు ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. అయితే వారి రక్త నమునాలను సేకరించిన వైద్యులు.. వాటిని పుణేలని వైరాలజీ ల్యాబ్కు పంపారు. వారు చేసిన పరీక్షల్లో.. ఆ నలుగురి రక్త నమునాల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని తెల్చింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఊపిరిపీల్చుకుంది.
అనుమానిత కేసులతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నోడల్ ఆస్పత్రులుగా గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులను చేర్చారు. కాగా చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలింపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో కరోనా వైరస్పై అలర్ట్ కావడంతో ఢిల్లీ నుంచి కేంద్ర ఆరోగ్య బృందం ఆస్పత్రుల పరిశీలనకు వచ్చింది.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని కేంద్ర వైద్య బృందం పరిశీలిస్తోంది. కేంద్ర వైద్య బృందంలో న్యూఢిల్లికి చెందిన ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజిత్ సింగ్, అమిత్సురి, మైక్రోబయాలజీ హెచ్ఎండీ నందిని దుగ్గల్, ముంబైకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వినయ్ గార్గ్, ఆర్కే గుప్తా, రోజాలిన్ దాస్, చెన్నైకి చెందిన తుషార్ నాలా, ప్రతాప్ సింగ్, డాక్టర్ మోనికా మత్లాని, బెంగళూరుకు చెందిన డాక్టర్ శిఖా వర్ధన్, ఆర్కే.మహజన్, డాక్టర్ మల చబ్రా, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు అనిత వర్మ, అజయ్ చౌహన్, శుభాగార్గ్లు ఉన్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులపై వైద్య బృందం పలు సూచనలు చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రికిని కేంద్రం బృందం సందర్శించనుంది. హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో సమర్థవంతమైన చికిత్స అందించేందుకు అధునాతన ఐసీయూలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేరళలోనూ కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఐదుగురిని వైద్యులు పరిశీలిస్తున్నారు. 431 మందిని ఇళ్లలోనే ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.