రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపోరేటును పెంచింది. 50 బేసిక్ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు భారత ఆర్థిక వ్యవస్థ సహజంగానే ప్రభావితం అవుతుందని తెలిపారు. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేయగా, జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేసింది.
కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత వరుసగా మూడోసారి ఆర్బీఐ రెపోరేటును పెంచడం గమనార్హం. మే నెలలో 40 బేసిక్, జూన్ ద్వైమాసిక సమీక్షలో మరో 50 బేసిక్ పాయింట్లను పెంచిన విషయం తెలిసిందే. బ్యాంకులు ఆ భారాన్ని తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. ఈ సారి కూడా రెపో రేటును పెంచడంతో మళ్లీ ఆ భారాన్ని బ్యాంకులు వినియోగదారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో మరోసారి గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ ఈఐంఎలు మరింత భారం కానున్నాయి.