తెల్లారితే పెళ్లి.. వధువుకు కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 6:00 AM GMT
తెల్లారితే పెళ్లి.. వధువుకు కరోనా

వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లారితే పెళ్లి. అయితే.. అంతలోనే ఓ విషయం తెలియడంతో పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది. పెళ్లికూతురికి కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం చెంచు కాలనీకి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. ఈ నెల 25న పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం వివాహానికి మూడు రోజుల ముందు వధూవరులు ఇద్దరు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయం పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్‌ అని రిపోర్టులు వచ్చాయి. దీంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. దీంతో ఇరు కుటుంబాలు చర్చించుకుని చేసేది లేక వివాహాన్ని వాయిదా వేశాయి. ఇక నందికొట్కూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 22న కోట హైస్కూల్‌ వద్ద 378 మంది పరీక్షలు చేస్తే.. 100 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది.

ఇలాంటి ఘటననే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చోటు జరిగింది. పెళ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంతలో అతడికి కరోనా పాజిటివ్‌ అంటూ రిపోర్టు వచ్చింది. దీంతో పెళ్లిని వాయిదా వేశారు.

Next Story