విశాఖ విజయశ్రీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2020 1:33 PM IST
విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భయాందోళనకు గురైన కార్మికులు వెంటనే పరుగులు తీశారు. మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. పేలుడు తీవ్రతకు రెండు ద్విచక్ర వాహానాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి దగ్గరలోనే అగ్నిమాపక యంత్రం ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన, సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం, రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో ప్రమాదం ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.