గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 2 Jun 2025 4:02 PM IST

Andrapradesh, Cm Chandrababu, Ys Jagan, Tdp, Ysrcp, Ap Government

గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. చంద్రబాబు తన దశాబ్దాల అనుభవం, పాలనాదక్షత గురించి గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పులో 44 శాతానికి సమానమైన రుణాన్ని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే తీసుకుందని ఆరోపించారు. ఈ ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి గానీ, సంక్షేమ కార్యక్రమాలు గానీ చేపట్టకుండానే ఇంత భారీగా అప్పులు చేయడంపై జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని జగన్ విమర్శించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), జాతీయ గణాంక కార్యాలయం (ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ గణాంకాలు ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలను స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

* స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఆర్థిక లోటు గతంలో 4.08 శాతం ఉండగా, అది ఇప్పుడు 5.12 శాతానికి పెరిగిపోయిందని తెలిపారు.

* అదేవిధంగా, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 2.65 శాతం నుంచి ఏకంగా 3.61 శాతానికి ఎగబాకిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

* కరోనా మహమ్మారి వంటి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ, రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో ఏకంగా 35.64 శాతానికి చేరడం ఆందోళనకరమని అన్నారు.

* 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సమీకరించిన రుణాలలో కేవలం 23.49 శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం కేటాయించారని, తమ హయాంలో ఇది 33.25 శాతంగా ఉండేదని జగన్ గుర్తుచేశారు.

చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని జగన్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Next Story