కూటమి ప్రభుత్వానికి వారిపై మానవత్వం లేదు: షర్మిల

By Knakam Karthik
Published on : 26 Aug 2025 2:48 PM IST

Andrapradesh, Ys Sharmila, AP Government, Congress, CM Chandrababu

కూటమి ప్రభుత్వానికి వారిపై మానవత్వం లేదు: షర్మిల

కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణం. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయం. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్ పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదు.

బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదే. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదు. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయండి. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం..అని షర్మిల ట్వీట్ చేశారు.

Next Story