ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్

కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 18 Jun 2025 8:42 PM IST

ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్

కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు వైఎస్ జగన్.

ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితాలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. జూన్‌ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదని, వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉందని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story