ప్రతిపక్ష హోదా మాకు కాకుండా ఇంకెవరికిస్తారు?..ఏపీ సర్కార్‌పై జగన్ ఫైర్

అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి. మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. వైఎస్ జగన్ అని ప్రశ్నించారు.

By Knakam Karthik  Published on  5 March 2025 1:45 PM IST
Andrapradesh, Cm Chandrababu, Ys Jagan, Tdp, Ysrcp, PawanKalyan

ప్రతిపక్ష హోదా మాకు కాకుండా ఇంకెవరికిస్తారు?..ఏపీ సర్కార్‌పై జగన్ ఫైర్

బాబు ష్యూరిటీ.. భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ అని ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు మోసం త‌ప్ప ఏమీ చేయ‌డం లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయన మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ మాట్లాడుతూ... అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేద‌న్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామ‌ని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైరయ్యారు. ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వకుండా సభ ఎందుకు నడుపుతున్నట్లు? అని జగన్ ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబుకు మేం ప్రతిపక్ష హోదా ఇచ్చాం. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి. మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇన్ని సీట్లు ఉంటే ఇస్తామనే రూల్ లేదు. ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చినా అక్కడ ఆప్ సర్కార్ బీజేపీకి గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అని జగన్ వివరించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌వేశ‌పెట్టిన‌ రెండు బడ్జెట్‌లలోనూ మోసం త‌ప్ప ఏమీ లేదు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫోస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావ‌డం లేదు. ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్ప‌టివ‌ర‌కు చంద్రబాబు ఇచ్చింది మాత్రం బోడి సున్నా" అని జ‌గ‌న్ ఆరోపించారు.

కాగా వైసీపీ వాళ్లకు ఏ పనులూ చేయొద్దన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ సీరియస్ అయ్యారు. పథకాలు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికీ ఇదేమైనా బాబు గారి సొమ్మా? ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చంద్రబాబు ప్రమాణం చేశారు. ఇప్పుడేమో బహిరంగంగానే పథకాలు ఇవ్వొద్దు అంటున్నారు. అలాంటి మనిషిని సీఎంగా కొనసాగించడం ధర్మమేనా? గవర్నర్, జడ్జిలు ఆలోచించాలి. అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Next Story