ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బీజేపీ నాయకులు తమను సంప్రదించి మద్దతు కోరారని, దీనికి తమ పార్టీ సానుకూలంగా స్పందించిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
తమ పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా జరిగిందని గుర్తుచేశారు. గతంలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇచ్చామన్నారు బొత్స సత్యనారాయణ. కేవలం ఎన్నికల్లోనే కాకుండా, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు తెలిపిందని వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, అనవసరమైన ‘నంబర్ గేమ్’ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఆ తర్వాత ద్రౌపది ముర్ముకు కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.