కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని మహిళా కమీషన్ ఛైర్మన్ శైలజా రాయపాటి ఖండించారు. ఘటనపై స్పందిస్తూ.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో ఆరేళ్ల బాలికపై రంగస్వామి అనే రాక్షసుడు అత్యాచారాన్ని చేయడం కలచివేసిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మానవత్వం మంటగలిసే ఇటువంటి దురాగతాలకు తావులేకుండా నిందుతలకు తగిన శిక్ష వేయాలన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. నిందితుడిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారని.. బాలికకు మహిళా కమీషన్ అండగా ఉంటుందన్నారు.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే జిల్లాలోని హోళగుంద మండలంలో బి.హల్లీ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు బోయ రంగన్న అనే వ్యక్తికి జిల్లా మహిళా స్పెషల్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై మహిళా కమీషన్ కొరడా ఝులిపిస్తుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే చట్టం శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు.