విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా సాయంత్రం రావాలంటూ పోలీసులు తిప్పి పంపించారు. చివరిసారి ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆధారం ఇచ్చినా సరే వెంటనే పోలీసులు చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నున్న సీఐ, సెక్టార్ ఎఎస్ఐ పై సస్పెన్షన్ వేటు వేసింది.
విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని... నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు. అంతకు ముందు చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.