అక్కడ మోదీ ఫోటో లేకపోవడంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం
Union Minister Nirmala Sitharaman Conducted Surprise Inspection in Ration Depot in Tallapalem. విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం
By Medi Samrat
విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేటలో ఉన్న రేషన్ డిపోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. రేషన్ డిపోల దగ్గర సాధారణంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు ఉంటాయి. కానీ ఆమె వెళ్లిన డిపో దగ్గర ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని గుర్తించిన ఆమె రేషన్ డీలర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గరీబ్ కల్యాణ్ అన్న యోజన' పథకం కింద కేంద్రం బియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని, అలాంటప్పుడు రేషన్ షాపు వద్ద ప్రధాని ఫొటో లేకుండా బియ్యం ఎలా పంపిణీ చేస్తారని డీలర్ను ప్రశ్నించారు. వాహనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటికే బియ్యం సరఫరా చేస్తోందని జేసీ వేణుగోపాల్రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్ నిర్మలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఇప్పుడెందుకని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి 'గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం' గురించీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ నాథ్ను వివరించమన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రేషన్ డిపోలలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫోటోలు వారు పెడితే కుదరదు. ఏ అన్న ఫొటో ఉన్నా లేకున్నా.. ప్రతీ రేషన్ డిపోలో మన అందరి అన్న నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని నిర్మలా సీతారామన్ స్పషం చేశారు. విశాఖపట్టణంలోని చినవాల్తేరులో పట్టణ ఆరోగ్య కేంద్రంలో కేంద్రమంత్రి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. దేశంలో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు.