అమరావతి: కాకినాడ సెజ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.
కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సందర్భంలో కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం పర్యటనలోను కాకినాడ జిల్లా యంత్రాంగంతో ఈ అంశంపై చర్చించారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్కి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు.