ఆసక్తికర ప‌రిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత

టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 6:18 PM IST

ఆసక్తికర ప‌రిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీని వీడి, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అధికారం లో ఉన్న టీడీపీ లోకి వైసీపీ నాయకులు క్యూ కడుతూ ఉంటే.. టీడీపీ నేత వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు.

Next Story